Manyamkonda:మన తెలంగాణలో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంది. అదే మహబూబ్నగర్ జిల్లాలో కొలువైన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం. దీనిని భక్తులు ‘కలియుగ వైకుంఠం’ అని, ‘తెలంగాణ తిరుపతి’ అని సగర్వంగా పిలుచుకుంటారు. 600 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ, ఎందరో భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. తిరుపతి వెళ్లలేని భక్తులకు, మన్యాల కొండపై కొలువైన స్వామిని దర్శించుకుంటే అదే పుణ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
తిరుపతిలో లాగానే, మన్యాల కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉండగా, కొండ కింద శ్రీ అలమేలు మంగమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ ప్రదేశం మొదట ‘మునులకొండ’ అని పిలవబడిందని స్థలపురాణం చెబుతోంది. కారణం, ఈ ఆలయం సమీపంలో పూర్వం ఎంతో మంది ఋషులు, మునులు తపస్సు చేశారట. కాలక్రమేణా ఆ పేరు ‘మన్యాలకొండ’గా మారిపోయింది. మహబూబ్నగర్ జిల్లాకు 17 కిలోమీటర్ల దూరంలో, రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన కొండలపై ఈ ఆలయం ఉంది. ఇక్కడ ‘చెక్కుడు లేని కోనేరు’, ‘చెక్కని పాదాలు’, ‘చెక్కిన విగ్రహం కాని స్వామి’ (అంటే స్వయంభూవు) లాంటి అరుదైన విశేషాలు ఈ ఆలయానికి ప్రత్యేకతను తీసుకువచ్చాయి.
సుమారు 600 సంవత్సరాల క్రితం, తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో ఉన్న అలహరి గ్రామానికి చెందిన అలహరి కేశవయ్య అనే భక్తుడికి శ్రీనివాసుడు కలలో కనిపించాడట. కృష్ణా నది ఒడ్డున, మన్యాల కొండపై తాను ఉన్నానని, వెంటనే అక్కడికి వెళ్లి రోజువారీ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆజ్ఞాపించి అదృశ్యమయ్యాడట. స్వామివారి ఆజ్ఞతో కేశవయ్య తన తండ్రి అనంతయ్య, కుటుంబ సభ్యులతో కలిసి మన్యాల కొండ సమీపంలోని కోటకదిరలో స్థిరపడి, కొండపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించాడు.

కేశవయ్య ఒకరోజు కృష్ణా నదిలో స్నానం చేసి, సూర్య భగవానుడికి నమస్కరించి పూజలు చేస్తుండగా, శ్రీ వేంకటేశ్వర స్వామి శిలారూప విగ్రహం ఆయన దోసిలిలో ప్రత్యక్షమైందట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యాల కొండపై ఉన్న ఒక గుహలో శేషశయన రూపంలో ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలతో స్వామిని పూజించడం మొదలుపెట్టాడు. ఈ గుహలో స్వామిని ప్రతిష్టించిన తర్వాత, ఆలయ ఆవరణలో శ్రీ ఆంజనేయ స్వామి, గరుడాల్వార్ విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపై, అప్పట్లో మునులు తపస్సు చేశారని చెప్పబడే ఒక గుహ కూడా ఉంది.
మన్యాల కొండ ఆలయం అలహరి వంశీయుడైన హనుమద్దాసు రచించిన కీర్తనలతో మరింత కీర్తి ప్రతిష్టలు పొందింది. హనుమద్దాసు సుమారు 300 కీర్తనలను రచించాడని చెబుతారు. ఈ కీర్తనలే ఆలయ చరిత్రను మరింత సుసంపన్నం చేశాయి. హనుమద్దాసు తర్వాత, వారి కుటుంబీకులు అలహరి రామయ్య ఆలయంలో నిత్యపూజలు, సేవలను కొనసాగించారు. వంశపారంపర్య ధర్మకర్తగా వారు ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. స్వామివారికి ప్రత్యేక సందర్భాలలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం ‘తిరుచ్చి సేవ’, ప్రతి పౌర్ణమికి స్వామివారి ‘కల్యాణోత్సవం’ ఘనంగా జరుగుతాయి. స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని ‘దాసంగం’ అని పిలుస్తారు. భక్తులు స్వామివారికి దాసంగాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
మన్యాల కొండ దిగువన శ్రీ అలమేలు మంగమ్మ తల్లి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం, వందల సంఖ్యలో వివాహాలు ఈ అమ్మవారి సన్నిధిలో జరుగుతాయి. పెళ్లి చేసుకోవాలనుకునే వారు, పిల్లలు లేని వారు అమ్మవారి సమక్షంలో మొక్కులు తీర్చుకోవడం, పెళ్లి చేసుకోవడం ఒక ఆచారంగా మారింది. దూర ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయంలో వివాహాలు చేసుకోవడానికి వస్తారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చనలు, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించి పునీతులవుతారు.
స్థలపురాణం ప్రకారం, అలహరి రామయ్యకు అమ్మవారు కలలో కనిపించి, తిరుపతిలో లాగానే దత్తకొండపై అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని సూచించారట. అందుకు అనుగుణంగా, 1957-58 సంవత్సరంలో అలమేలు మంగమ్మ తన సొంత నిధులతో దత్తకొండపై ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోకి తిరుమల తిరుపతి నుండి అలమేలు మంగమ్మ తల్లి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్టించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం, ఫాల్గుణ ద్వాదశి రోజున అమ్మవారి జాతర, ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
మన్యాల కొండకు ఎలా వెళ్లాలి?
బస్ మార్గం: హైదరాబాద్ నుండి మన్యాల కొండకు నేరుగా ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు నుండి వచ్చే భక్తులు జడ్చర్ల లేదా భూత్పూర్లో దిగి, మహబూబ్నగర్ మీదుగా మన్యాల కొండకు చేరుకోవచ్చు.
రైలు మార్గం: రైలులో రావాలనుకుంటే, హైదరాబాద్ లేదా కర్నూలు నుండి రావొచ్చు. మహబూబ్నగర్-దేవరకద్ర మార్గంలో ఉన్న కోటకదిర రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి.
వసతి: మన్యాల కొండ శ్రీ అలమేలు మంగమ్మ తల్లి దేవస్థానంలో భక్తులకు వసతి సౌకర్యాలు లేవు. అయితే, మూడు కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు బస చేయడానికి వసతి గృహాలు ఉన్నాయి. భక్తులు ఆ వసతి గృహాలలో బస చేయవచ్చు. ఇందుకోసం రోజుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ బస చేయొచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.